ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా 11మందిపై మహబూబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో 21 సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.
ఈ కేసులో ఏకంగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పైన కూడా కేసు నమోదైంది. సీఈసీతో పాటు సీఈసీ కార్యదర్శి సంజయ్ కుమార్, గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్, రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఐఏఎస్ అధికారి వెంకట్రావు, డిప్యూటీ కలెక్టర్ పద్మశ్రీ, అప్పటి ఆర్డీఓ శ్రీనివాస్, ఐటీ టీమ్ సభ్యుడు వెంకటేష్ గౌడ్, న్యాయవాది రాజేంద్ర ప్రసాద్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సుధాకర్ పైనా కేసు నమోదు చేశారు. ఈ అంశం ప్రస్తుతం రాష్ట్రంతో పాటు జాతీయ స్థాయిలోనూ కీలకంగా మారింది. ఈ తరహాలో ఏకంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ పైనే కేసు నమోదు కావడం ఇదే మొదటి సందర్భంగా చెబుతున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ వ్యవహారంపై కేసు నమోదు అంశం ఈసీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఏకంగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ పైనే కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. తర్వాత ఏం చేయాలన్న విషయమై ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి హస్తినలో ఉండి సంబంధిత అంశాలపై చర్చిస్తున్నారు. రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సీఈసీపై ఈ తరహా కేసు నమోదు కావడం చిన్న విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ కేసు విషయంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయమై ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలి.. ఏం చేయాలన్న విషయమై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అటు సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్ కూడా సీఈఓ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. తర్వాత ఏం చేయాలన్న విషయమై ఆరా తీస్తున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ 2018లో ఎన్నికల సమయంలో అఫిడవిట్ సమర్పించినప్పుడు తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని సీహెచ్ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ను ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
ఆర్టీఐ కింద కూడా ఆయన కేంద్ర ఎన్నికల సంఘాన్ని సమాధానం కోరారు. ఐతే దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టీఐ ద్వారా సమాచారం అందించింది. 2018 నవంబర్ 14న మూడు సెట్ల నామినేషన్లు, ఆ తర్వాత 2018 నవంబర్ 19న ఒక సెట్ నామినేషన్ ను శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేశారని తెలిపింది. ఐతే వాటిలో మూడు సెట్ల నామినేషన్లను డూప్లికేషన్ కింద రెజెక్ట్ చేసినట్లు వెల్లడించింది. ఐతే వెబ్ సైట్లో మల్టిపుల్ లేదా డూప్లికేట్ అప్లికేషన్లను సేవ్ చేసే ఆప్షన్ లేకపోవడంతో … అఫిడవిట్స్ తో సహా వాటికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని పేర్కొంది.