రాష్ట్ర ప్రభుత్వం తనకు సెక్యూరిటీ తగ్గించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కోర్టు చెప్పినా ప్రభుత్వం తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదన్నారు. తాను ఎంపీగా ఉన్నానని.. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న తనకు సెక్యూరిటీ ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కు కావాల్సినంత సెక్యూరిటీ ఇచ్చామని ఆయన గుర్తు చేశారు.
తాను ప్రజల మనిషినని.. తనకు సెక్యూరిటీతో పనిలేదన్నారు రేవంత్ రెడ్డి. తాను సెక్యూరిటీ లేకుండా ఎక్కడికైనా వస్తానని.. అదే సీఎం కేసీఆర్ ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు రాగలరా? అని ప్రశ్నించారు.
తనను ఓడించడానికి సీఎం కేసీఆర్ పోలీసులను వాడుకున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ విషయంలో తనను భయపెట్టాలని చూస్తే భయపడే వాడిని కాదన్నారు. లక్షలాది మంది కార్యకర్తలే తన సైన్యమని.. వాళ్లే తనకు సెక్యూరిటీ అన్నారు.
ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టబోమని మరోసారి హెచ్చరించారు రేవంత్రెడ్డి. వారి పేర్లు రెడ్ బుక్లో రాస్తున్నామని.. అధికారంలోకి వచ్చాక చర్యలు ఉంటాయని అన్నారు. తాను మాట్లాడుతున్నది ప్రభాకర్రావు, నర్సింగరావు, భుజంగరావు, రాధాకిషన్రావు.. లాంటి పోలీస్ అధికారుల గురించి మాత్రమేనని.. వారికి రాజకీయాలతో పనేంటని నిలదీశారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రేవంత్.