గన్నవరంలో రాజకీయం గరంగరంగా మారింది. వైసీపీకి గుడ్బై చెప్పేశారు ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావ్. పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఉంటే ఉండు, పోతే పో అన్నట్టు సజ్జల మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తనకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని.. వచ్చే ఎన్నికల్లో తాను గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వస్తానని.. పులివెందుల ఎమ్మెల్యే జగన్ను అసెంబ్లీలోనే కలుస్తానని.. సవాల్ చేశారు యార్లగడ్డ.
తాను పెనమలూరు వెళ్లిపోతున్నానని సొంత పార్టీలోనే ప్రచారం చేస్తున్నారని.. వైసీపీలో ప్రతి రోజూ ప్రాతివత్యం నిరూపించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. అవమానాలు భరించలేకే.. అధికార పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు యార్లగడ్డ వెంకట్రావు.
టీడీపీలో చేరేందుకు.. చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో గన్నవరం టీడీపీ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి కానుకగా ఇస్తానని అన్నారు.
అటు, కొంతకాలంగా గన్నవరం పాలిటిక్స్ కాక మీదున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకే ఈసారి వైసీపీ టికెట్ అనే ప్రచారం జరుగుతోంది. జగన్ సైతం వంశీవైపే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. ఇక వైసీపీ టికెట్ తనకు రాదని ఫిక్స్ అయ్యారు యార్లగడ్డ వెంకట్రావ్. అందుకే పార్టీ మార్పుపై విజయవాడలో కార్యకర్తలతో సమావేశమై.. తాను టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని చెప్పారు.