Khairatabad : హైదరాబాద్ లో వినాయక చవితి ఉత్సవాల సందడి మొదలైంది. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ విగ్రహం నమూనాను విడుదల చేసింది. ఈ ఏడాది శ్రీదశమహా విద్యాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు.
ఖైరతాబాద్లో గణేశ్ ఉత్సవాలు ప్రారంభమై 69 ఏళ్లు పూర్తవుతుంది. ఏటా సిద్ధాంతి విఠల్ శర్మ సూచనతో గణేషుడి నమూనా సిద్ధం చేస్తున్నారు. ఆనవాయితీ ప్రకారమే ఆయన సూచనలతో ఈ ఏడాది శ్రీదశమహా విద్యాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులు ఉండేలా వినాయకుడి విగ్రహం తయారు చేస్తున్నారు. శ్రీ దశమహా విద్యాగణపతి నిల్చున్న రూపంలో దర్శనమిస్తారు. తలపై ఏడు సర్పాలు ఏర్పాటు చేస్తారు. వెనుక భాగంలో సంస్కృతంలో రాసిన గ్రంథం ఉంటుంది. ఈ గణేషుడికి 10 చేతులు ఉంటాయి. కుడివైపు ఉన్న చేతుల్లో ఆశీర్వాదం, దండ, వరి ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపు ఉన్న చేతుల్లో లడ్డూ, గ్రంథం, తాడు, అంకుశం, బాణం పెడతారు. కాళ్ల వద్ద చెరోవైపు 10 అడుగుల వరాహదేవి, సరస్వతీ దేవి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. అక్కడే మూషికం కూడా ఉంటుంది.
ప్రధాన మండపం 2 వైపులా చిన్న మండపాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. కుడివైపు 15 అడుగుల శ్రీపంచముఖ లక్ష్మీనారసింహస్వామి, ఎడమవైపున శ్రీవీరభద్రస్వామి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు. సెప్టెంబర్ 18న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 28 వరకు వేడుకలు నిర్వహిస్తారు.
విగ్రహం తయారీ పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయి. వినాయక చవితికి 3 రోజులు ముందే భక్తులు వీక్షించేందుకు శ్రీదశమహా విద్యాగణపతి విగ్రహాన్ని అందుబాటులో ఉంచుతామని ఉత్సవ కమిటీ ప్రకటించింది.