MLA: స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. మామూలు నియోజకవర్గం, మామూలు ఎమ్మెల్యేనే అయినా.. ఈయన గురించి తెలీని వారు దాదాపు ఉండరు. అంతగా వైరల్ న్యూస్ ఉన్నాయి అతనిపైన. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా డిప్యూటీ సీఎం అయి.. ఆ ముచ్చట తీరకుండానే.. పదవి ఊడిపోయింది. టికెటే రాదనుకుంటే.. మరోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచేశారు.
అయితే, మహిళలతో రాజయ్య చిలిపి చేష్టలు ఆయన్ను స్టేట్ వైడ్ పాపులర్ చేశాయి. ఆ చేష్టలు మరింత శృతిమించి.. ఎమ్మెల్యేపై మహిళా నేతలు తిరగబడే పరిస్థితి వచ్చింది. పోలీస్ కేసులకూ దారి తీసింది. ఇలా ఇమేజ్ అంతా డ్యామేజ్ కావడంతో పాటు.. రాజయ్య సీటుపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కన్నేయడం ఆయన్ను మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. రాజయ్యపై నెగిటివ్ బాగా పెరిగిపోవడంతో.. ఈసారి ఆయనకు బీఆర్ఎస్ టికెట్ వస్తుందో రాదో డౌట్ అంటున్నారు. ఈ విషయం అందరికంటే ఆయనకే బాగా తెలుసు.
అందుకే, ఓ ఉపాయం ఆలోచించారు తాటికొండ రాజయ్య. కేసీఆర్, జగన్లకే అధికారాన్ని కట్టబెట్టిన.. మోస్ట్ పవర్ఫుల్ రాజశ్యామల యాగాన్ని ఆరంభించారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో శాస్త్రోక్తంగా యాగ సంకల్పం నిర్వహించారు. మళ్లీ టికెట్ తనకే రావాలని.. మరోసారి గెలవాలని.. మంత్రి పదవి కూడా కలిసిరావాలని కోరుకున్నా.. బయటకు మాత్రం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసమే యాగం చేస్తున్నానని చెప్పారు.
యాగం చేయడం వరకు బాగానే ఉన్నా.. దళిత వర్గమే అయినా.. క్రైస్తవ మతం ఆచరించే ఎమ్మెల్యే రాజయ్య.. ఇలా రాజశ్యామల యాగం చేయడం మరింత ఆసక్తికర అంశం. పదవి కోసం ఎన్ని ప్రయత్నాలైనా చేస్తారు లీడర్లు.