MallaReddy: మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. 30 కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు మంత్రి మల్లారెడ్డి, ఆయన బామ్మర్ది శ్రీనివాస్ రెడ్డి కుట్ర చేశారంటూ మర్రి వెంకట్రెడ్డి, దయాసాగర్ రెడ్డి మీడియాను ఆశ్రయించారు. మంత్రి పలుకుబడితో పోలీసులు కేసు తీసుకోవడం లేదన్నారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన వర్గం నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ వాపోయారు.
మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో మంత్రి మల్లారెడ్డి కాలేజ్ ఎదురుగా ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. సుంకరి కుటుంబం నుండి తాము కొన్నామని మర్రి వెంకట్రెడ్డి, దయాసాగర్ రెడ్డి చెప్తున్నారు. సుంకరి కుటుంబానికి చెందిన 8 ఎకరాల్లో 4.5 ఎకరాలు కొనుగోలు చేశామంటూ డాక్యుమెంట్లు చూపిస్తున్నారు. మరోవైపు మంత్రి మల్లారెడ్డి తన భార్య కల్పన పేరు మీద ఆ 8 ఎకరాల్లోని 2 ఎకరాలు కొన్నారని చెప్తున్నారు. కేవలం రెండు ఎకరాలు మాత్రమే కొని.. భూమి మొత్తాన్ని కబ్జా చేసేందుకు కుట్ర చేశారని బాధితులు అంటున్నారు. తాము కొన్న భూమి దగ్గరకు కూడా రానివ్వకుండా మంత్రి, ఆయన అనుచరులు దాడి చేశారని.. మంత్రి బావమరిది శ్రీనివాస్ రెడ్డి కాల్చివేస్తానంటూ గన్ గురి పెట్టారని ఆరోపించారు.
మంత్రి మల్లారెడ్డి, ఆయన బావమరిది శ్రీనివాస్రెడ్డి, వాళ్ల అనుచరుల దౌర్జన్యాలపై తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని మర్రి వెంకట్రెడ్డి, దయాసాగర్ రెడ్డి చెప్తున్నారు. అయితే రాజకీయ ఒత్తిడి ఉందంటూ తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ధరణి డాక్యుమెంట్లు చూపించినా పట్టించుకోవడం లేదన్నారు. చాలామంది రైతులను మంత్రి మల్లారెడ్డి మోసం చేశారంటూ బాధితులు ఆరోపించారు.