తిరుమల కాలి నడకన వెళ్తున్న భక్తులపై చిరుతల దాడిపై ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా కాలి నడక మార్గంలోకి చిరుతలు, ఎలుగుబంట్లు ఎందుకు వస్తున్నాయనేది మిస్టరీగా మారింది. మెట్ల మార్గానికి సమీపంలోనే 4 రోజుల్లో 2 చిరుతల్ని అటవీశాఖ అధికారులు బంధించారు. అంటే.. భక్తులకు అతి సమీపంలోనే చిరుతలు సంచరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎక్కడో డీప్ ఫారెస్ట్లో ఉండాల్సిన చిరుతలు.. కాలి నడక మార్గానికి దగ్గరకు ఎందుకు వస్తున్నాయి? అంటే ఆశ్చర్యపర్చే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దట్టమైన అడవుల నిలయం శేషాచలం కొండలు. చిరుతలు, పులులు తదితర క్రూరమృగాలకూ ఆవాసం. అడవి మధ్యలో నుంచే మెట్ల మార్గం ఉంటుంది. కానీ.. గతంలో ఎప్పడూ మెట్ల మార్గానికి సమీపంలో క్రూరమృగాలు పెద్దగా కనిపించేవి కావు. ఎందుకంటే అవన్నీ శేషాచలంలోని డీప్ ఫారెస్ట్ ఏరియాలోనే తిరుగుతుండేవి. కానీ.. ఇటీవల మెట్ల మార్గానికి సమీపంలో సంచరిస్తున్నాయి. ఎందుకు?
చిరుతల దాడికి ఎర్రచందనం స్మగ్లర్లే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శేషాచల పరిస్థితులపై అవగాహన కలిగిన వాళ్లు సంచలన విషయాలు చెబుతున్నారు. ప్రపంచంలోనే అరుదైన అటవీ సంపద ఎర్ర చందనం. ఈ ఎర్ర బంగారాన్ని దోచుకునేందుకు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ అధికారులు కూడా స్మగ్లర్ల ఆట కట్టించలేకపోతున్నారు. ఎవరూ అడవి లోపలికి వెళ్లకుండా బలగాల్ని మోహరించినా కట్టడి చేయలేకపోతున్నారు. భద్రతా బలగాలపైనే స్మగ్లర్లు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇక అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లదే ఇష్టారాజ్యం అంటున్నారు.
గుట్టుచప్పుడు కాకుండా చెట్లు నరికేందుకు స్మగ్లర్లు డీప్ ఫారెస్ట్ను అడ్డాగా మార్చుకుంటున్నారు. స్మగ్లర్లు మెట్ల మార్గం నుంచే అడవి లోపలికి చొరబడుతున్నట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. ఏకంగా యంత్రాలతోనే చెట్లను నరికేస్తున్నారని కూడా అంటున్నారు. ఇలా డీప్ ఫారెస్ట్లో యంత్రాలు, శబ్దాలు, మనుషుల కదలికలతో వన్యమృగాలు బెదిరిపోతున్నాయట. వాటిని మరింత భయపెట్టేందుకు టపాసులు కూడా పేల్చుతున్నారట స్మగ్లర్లు. అందుకే, క్రూరమృగాలు దట్టమైన అడవుల్లోకి వెళ్లలేక.. మెట్ల మార్గం వైపు తమ ఆవాసాన్ని మార్చుకుంటున్నాయని అంచనా వేస్తున్నారు. కొత్త ఆవాసంలో ఆహారం దొరక్క.. వేట కష్టమై.. కాలినడకన వచ్చే పిల్లలపై దాడి చేస్తున్నాయని భావిస్తున్నారు.
దట్టమైన అడవుల్లో ఉండాల్సిన క్రూరజంతువులను వాటి మానాన వాటిని వదిలేస్తే అవి మనుషుల జోలికి వచ్చేవికావు. మనమే వాటి ఆవాసాల్లోకి జొరబడి.. వాటిని బెదరగొడుతుంటే.. అవి తిరిగి మన మీదకే వస్తున్నాయి. ప్రభుత్వం, అటవీ, పర్యావరణ విభాగాలు.. ఎవరి పని వారు కరెక్ట్గా చేస్తే.. ఇప్పుడీ విపరీత పరిణామాలు సంభవించేవి కావు. పెద్దలు చేసే తప్పిదాలకు అంతిమంగా బలవుతున్నది సామాన్యులే. సమస్యకు మూలాలు కనుక్కోకుండా.. సరైన పరిష్కారం వెతక్కుండా.. చేతికి కర్రలు ఇచ్చి పులుల్ని తరిమేయాలంట.. జరిగే పనేనా? చిరుతల్ని బోనుల్లో బంధించడం శాశ్వత పరిష్కారమా?.