రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 మరో కీలక ఘట్టం ఆవిష్కతమైంది. ఈ వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ సక్సెస్ ఫుల్ గా విడిపోయింది. చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు ల్యాండర్ విక్రమ్ సిద్ధమైంది. ఇక నుంచి ల్యాండర్ మాడ్యూల్ విక్రమ్ స్వయంగా చంద్రుడిని చుట్టేస్తుంది.
చంద్రయాన్-3ను జులై 14న ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. ఈ రాకెట్ ను విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత రోజు తొలిసారి చంద్రయాన్ -3 కక్ష్యను పెంచారు. 18 రోజుల వ్యవధిలో దశలవారీగా 5సార్లు కక్ష్యను పెంచారు. ఐదో భూకక్ష్య పూర్తైన తర్వాత చంద్రుడిగా దిశగా ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు.
ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా చేర్చారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి చంద్రయాన్-3ను చేరువ చేశారు.
బుధవారం చంద్రయాన్-3 చివరి దశ కక్ష్యలోకి ప్రవేశించింది. గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయింది. ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెడుతుందని ఇస్రో ప్రకటించింది. ఆరోజు కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.