ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రోడ్డు విస్తరణ పనులు పొలిటికల్ హీట్ ను పెంచాయి. గాంధీ సెంటర్లో మహనీయుల, రాజకీయ నేతల విగ్రహాల తొలగింపు పెనుదుమారం రేపుతోంది. బుధవారం అర్ధరాత్రి భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ, అంబేడ్కర్, అబ్దుల్ కలామ్, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, గుర్రం జాషువా, దేవినేని వెంకట రమణ, తంగిరాల ప్రభాకరరావు విగ్రహాలను మున్సిపల్ అధికారులు తొలగించారు.
ఈ విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో వద్ద ఉన్న టాయిలెట్ల పక్కన ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహనీయులకు కనీస గౌరవం ఇవ్వరా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం ఏంటని నిలదీస్తున్నారు.
నందిగామ గాంధీ సెంటర్ లో విగ్రహాల తొలగింపుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అభ్యంతరం తెలిపారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోకాలంగా అక్కడ విగ్రహాలు ఉన్నాయన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైసీపీ నేతల ఆదేశాలతో మున్సిపల్ అధికారులు విగ్రహాలను తొలగించారని మండిపడ్డారు.
దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే అక్కడ ఉంచడాన్ని దేవినేని ఉమా తప్పుపట్టారు. మిగిలిన విగ్రహాలను తొలగించి మహనీయులను అవమానించారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే విగ్రహాలను మళ్లీ అక్కడే పెడతామని స్పష్టం చేశారు. నిరసన తెలిపేందుకు నందిగామ వెళుతుండగా దేవినేని ఉమాను గొల్లపూడిలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
నందిగామ టీడీపీ ఇన్ ఛార్జి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద పోలీసులు భారీ మోహరించారు. మున్సిపల్ కమిషనర్ ను కలిసి విగ్రహాల తొలగింపుపై మాట్లాడేందుకు వెళుతుండగా సౌమ్యను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తంగిరాల సౌమ్య రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మరోవైపు ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే విగ్రహాల తొలగింపు చేపట్టామని మున్సిపల్ అధికారులు స్పష్టం చేశారు.