పెద్దపల్లి జిల్లాలో అత్యంత దారుణ ఘటన జరిగింది. బాలికపై నలుగురు దుండగుల సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాలికను తల్లిదండ్రులు స్వస్థలం మధ్యప్రదేశ్ తరలిస్తుండగా మృతి చెందింది. గుట్టుచప్పుడు కాకుండా బాలికకు అంత్యక్రియలు పూర్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో ఈ దారుణం జరిగింది. వెంచర్ వద్ద గుడిసెల్లో కార్మికుల కుటుంబాలు నివసిస్తున్నాయి. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి అక్కడికి వచ్చిన నలుగురు దుండగులు కార్మికుల కుటుంబానికి చెందిన బాలికను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలికను తల్లిదండ్రులు వారి స్వస్థలం మధ్యప్రదేశ్కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు… కేసు నమోదు చేశారు. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అప్పన్నపేటలో బాలికపై జరిగిన లైంగిక దాడిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కార్మికుల కుటుంబాలకు తెలిసిన వాళ్లే బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లినట్టు స్థానికుల చెబుతున్నారు. వెంచర్కు సంబంధం ఉన్న వ్యక్తులే బాలిక తల్లిదండ్రులను భయపెట్టి, మభ్యపెట్టి బాలికపై దారుణానికి పాల్పడ్డట్టు స్థానికుల మాటల ప్రకారం అర్థమవుతోంది. కానీ పేర్లు చెప్పవద్దంటూ బెదిరించినట్టు తెలుస్తోంది.
నలుగురు వ్యక్తులు వచ్చి బాలికను తీసుకెళ్లారు. అడ్డుకుంటే గుడిసెలు తగలబెడతామని బెదిరించారు. ఎవరో తెలిసిన వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొట్టచేతపట్టుకుని రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చిన నిరుపేద కార్మికుల కుటుంబానికి చెందిన బాలికపై ఇలా బలికావడం విషాదంగా మారింది.