బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల అస్త్రాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా ఖమ్మంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత రెండు ఎన్నికల్లో ఖమ్మంలో ఒక్కొక్క సీటుకే పరిమితమైన నేపథ్యంలో ఈ సారి కనీసం ఐదారు సీట్లైనా గెలవాలని భావిస్తున్నారు. అంతేకాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లో చేరి, పది సీట్లు గెలిపించుకుంటానని శపథం చేశారు. ఈ సవాల్ను కూడా కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అందుకు ధీటుగా తనదైన శైలిలో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. పొంగులేటి అనుచరులను టార్గెట్ చేశారు. దారికి రాకుంటే కేసులు… లేదంటే ఆకర్షణ మంత్రం ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు భద్రాచలంలో పొంగులేటి అనుచరుడు తెల్లం వెంకటరావును పార్టీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేశారు.
బీఆర్ఎస్, పొంగులేటి శ్రీనివాస్ మధ్య వార్ ముదిరింది. గత ఎన్నికల్లో ఎంపీ టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో పొంగులేటి బీఆర్ఎస్కు దూరంగా ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. పొంగులేటి ఏ పార్టీలో చేరుతారా అంటూ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పొంగులేటిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఇటీవలే పొంగులేటి కాంగ్రెస్లో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించుకుంటానని శపథం చేశారు.
పొంగులేటి కాంగ్రెస్లో చేరడంపై బీఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించలేదు. కానీ తెరవెనుక ఆపరేషన్ ఖమ్మం మాత్రం సీరియస్గా నడిపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటికి పది నియోజకవర్గాల్లో గట్టి పట్టుంది. ప్రతీ నియోజకవర్గంలో బలమైన అనుచరగణం, కార్యకర్తల మద్దతు ఉంది. పొంగులేటి టార్గెట్గా కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ నేరుగా ఇన్వాల్వ్ అవుతూ ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఈ యాక్షన్ ప్లాన్ మరింత తీవ్రం చేశారు.
ఇప్పటికే పొంగులేటి అనుచరుడు, ఖమ్మం డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబుపై తొమ్మిదేళ్ల క్రితం నాటి ఓ పాత కేసును తిరిగి తెరపైకి తెచ్చారు. మరో అనుచరుడు తుళ్లూరి బ్రహ్మయ్యపైనా పాత కేసును తిరగదోడారు. ఎన్ని వేధింపులకు గురి చేసినా కేసీఆర్పై పోరాటం కొనసాగిస్తామని పొంగులేటి చెబుతున్నారు. కానీ… ఇప్పుడు కేసీఆర్ మరో అస్త్రం బయటకు తీశారు. పొంగులేటి వర్గంలోని అసంతృప్తుల్ని ఆకర్షిస్తున్నారు. ఇందులో భాగంగానే భద్రాచలం నియోజకవర్గానికి చెందిన కీలక నేత తెల్లం వెంకటరావును పార్టీలోకి తీసుకుంటున్నారు.
తెల్లం వెంకటరావు పొంగులేటి వర్గంలో ముఖ్యనేత. భద్రాచలం, పినపాక ఏరియాల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల విజయవంతంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2018లో భద్రాచలం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి పోదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు పోదెం వీరయ్య కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు. తాను కూడా కాంగ్రెస్లో ఉంటే టికెట్ రావడం కష్టమని తెల్లం వెంకటరావు భావించారు. ఇదే అసంతృప్తితో ఉన్న తెల్లం వెంకటరావుపై బీఆర్ఎస్ ఆకర్షణ మంత్రం ప్రయోగించింది.