తిరుమల నడకదారిలో ఫారెస్ట్ అధికారుల చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిరుత పులులు ఒక్కొక్కటిగా బోనులో చిక్కుతున్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. ఈ విషయాన్ని అటవీశాఖ, టీటీడీ అధికారులు వెల్లడించారు. అలిపిరి కాలినడక మార్గంలో ఇటీవల 6 ఏళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత ప్రాణాలు కోల్పోయింది. నెలన్నర ముందు ఓ బాలుడిని చిరుత అడవిలోకి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
బాలికపై చిరుత దాడి ఘటన తర్వాత అటవీశాఖ సిబ్బంది, టీటీడీ అధికారులు చిరుతలను బంధించే చర్యలు చేపట్టారు. కాలినడక మార్గంలో 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మోకాలిమిట్ట, 35వ మలుపు వద్ద బోన్లు అమర్చారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఓ చిరుత బోనులోకి వచ్చి చిక్కింది. తాజాగా గురువారం తెల్లవారుజామున మరో చిరుత చిక్కింది. ఈ చిరుతను కూడా జూకు తరలించి అబ్జర్వేషన్ లో ఉంచారు. 50 రోజుల వ్యవధిలో మొత్తం 3 చిరుతలను బంధించారు.