ఎన్నికల ఏడాదిలో కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుండి విశ్వకర్మ పథకాన్ని ప్రకటించగా.. ఆ మర్నాడే పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కంద చేతివృత్తుల వారికి రాయితీపై రుణాలు ఇవ్వనున్నారు.
పీఎం విశ్వకర్మ పథకం కింద చేతివృత్తుల వారికి 2 లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. 5 శాతం వడ్డీతో ఈ రుణాలు పొందవచ్చు. ఇందుకు 13వేల కోట్లను కేంద్రం వెచ్చించనుంది. దీంతో 30 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.
చేతివృత్తుల వారికి రోజుకు 500 రూపాయలతో స్కాలర్ షిప్తో శిక్షణ.. ట్రైనింగ్ ముగిసిన తర్వాత పరికరాల కొనుగోలు కోసం 15 వేల ఆర్థిక సాయం.. ఆ తర్వాత రాయితీతో మొదట రూ.లక్ష రుణం వడ్డీపై ఇస్తామని కేంద్రం తెలిపింది. తొలి విడత సద్వినియోగం చేసుకుంటే రెండోవిడత కింద రూ.2లక్షల రుణం ఇవ్వనున్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి ఈ పథకం ప్రారంభం కానుంది.
ఇక నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించడం, రవాణా వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు పీఎం ఈ-బస్ సేవ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10వేల ఈ-బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తారు. పబ్లిక్-ప్రయివేట్ భాగస్వామ్యంతో 169 నగరాల్లో ఈ బస్సులను ప్రారంభించనున్నారు. ఇందుకు 57 వేల 613 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో 20వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. మిగతా నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
డిజిటల్ ఇండియా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 5.25 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు నైపుణ్యాలను మెరుగుపరుచనున్నారు. మరో తొమ్మిది సూపర్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం.
దేశంలో రైల్వే లైన్ విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడం కోసం ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూపీ, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్ వర్క్ను 32 వేల 500 కోట్లతో విస్తరించనున్నారు.
గుంటూరు – బీబీనగర్ రైల్వే లైన్ డబ్లింగ్కు పచ్చజెండా ఊపింది కేంద్రం. దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 239 కిలో మీటర్ల దూరానికి 3 వేల 238 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ పనులతో హైదరాబాద్ – చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. ఈ డబ్లింగ్ పనులు పూర్తైతే హైదరాబాద్ నుంచి విజయవాడకు సర్వీసులు పెరగనున్నాయి. సిమెంట్ పరిశ్రమలకు గూడ్సు రవాణాకు కూడా ప్రయోజనం చేకూరననుంది.
ముద్కేఢ్ – మేడ్చల్, మహబూబ్నగర్ – డోన్ మధ్య కూడా డబ్లింగ్ పనులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులు పూర్తైతే హైదరాబాద్ – బెంగళూరు మధ్య 50 కిలో మీటర్ల మేర దూరం తగ్గనుంది. కొత్త మార్గం పూర్తయితే వందే భారత్ వంటి రైళ్లకు ఉపయోగకరంగా మారనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో విజయనగరం నుంచి ఖుర్దా రోడ్ మీదుగా నెర్గుండి వరకు 3వ రైల్వేలైన్ నిర్మాణానికి కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
అయితే.. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు విపక్షాలు విమర్శిస్తున్నాయి.