AP News : కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లు. ఈరోజుల్లో ప్రతిదీ వ్యాపారమే. ఆఖరికి పనికిరాని చికెన్ వేస్ట్ను కూడా వ్యాపారంగా మార్చుకుని చేపల పెంపకం దారులు రెచ్చిపోతున్నారు. చికెన్ దుకాణదారులు మొదట్లో కోళ్ల వ్యర్థాలను వృథాగానే పడేసేవారు. దీనిపై కొందరి స్వార్థపరుల కన్ను పడింది. అంతే.. ఆ వ్యర్థాలతోనే వ్యాపారం మొదలుపెట్టేశారు. ఇలా కొనుగోలు చేసిన వ్యర్థాలను వాహనాల్లో తరలించి చేపల పెంపకం దారులకు విక్రయించేస్తున్నారు.
నాన్వేజ్ ప్రియుల్లో చేపలను ఇష్టపడని వాళ్లు ఉండరు. చికెన్, మటన్తో పోలిస్తే ఆరోగ్యకరమైన సీఫుడ్ అంటే లాగించేందుకు పోటీ పడతారు. అయితే ఏలూరు జిల్లా పెదపాడు మండలం పరిధిలోని చేపలు తిన్నారో ఆస్పత్రికి వెళ్లాల్సిందే. మేత ఖర్చు తగ్గించుకునేందుకు చేపల చెరువుల పెంపకం దారుల కక్కుర్తే ఇందుకు కారణం. చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేసి పెంచుతున్న బండారం బయటపడింది.
ఖర్చు తక్కువ అవ్వాలి.. త్వరగా చేపలు అమ్మేయాలి.. లాభాలు గడించాలి.. ఎవరు ఏమైపోతే తమకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు కొంతమంది ఆక్వా రైతులు. పౌల్ట్రీ ఉత్పత్తులకు సంబందించినవేవీ చేపల చెరువుకు మేతగా వేయకూడదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయినా లాభం వస్తే చాలన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తున్న తీరు ప్రజల ప్రాణాల మీదకు తీసుకువస్తోంది.
కోళ్ల వ్యర్ధాలను సేకరించడం కూడా ఓ వ్యాపారంగా మారిపోయింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి చికెన్ వేస్టేజ్ జిల్లాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్లను ఏర్పాటు చేసుకున్నారు యజమానులు. ఏలూరు జిల్లాలో పెదపాడు మండలంలోనే సుమారు 182 ఎకరాల్లో నిషేధిత చికెన్ వ్యర్థాలతో చేపలు పెంచుతున్నారని అధికారులు గుర్తించారు. సమన్వయ లోపం, నిర్లక్ష్య వైఖరి, చేపల చెరువుల యజమానుల లాబీయింగ్ .. అన్నీ కలిపి నిషేధిత మేతతో చేపలు పెంచుతున్నప్పటికీ ఎవరికీ పట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.