Eluru News : ఏలూరు జిల్లా సర్వజన ఆస్పత్రిలో దారుణం జరిగింది. గర్భిణికి ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర వదిలేశారు డాక్టర్లు. బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో వ్యవహారం వెలుగు చూసింది. ఎక్స్ రేలో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.
కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది మహిళ. ఆమెకు సిజేరియన్ చేసి, బిడ్డను బయటకు తీశారు వైద్యులు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆపరేషన్ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో కత్తెర మర్చిపోయారు.
డిశ్చార్జ్ తర్వాత ఇంటికెళ్లిన ఆ బాలింత.. కొంతకాలంగా కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. ఆసుపత్రికి వెళితే.. వైద్యులు ఎక్స్రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం బయటపడింది.
ఈ ఘటన బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్త పడుతున్నారు. ఆ ఎక్స్రేను ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దారుణం వెలుగు చూసింది. ఆపరేషన్ చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు.