చంద్రయాన్-3 లక్ష్యం దిశగా సాగుతోంది. చంద్రుడి ఉపరితలంపై దిగే సమయం దగ్గర పడింది. మరో వారం రోజుల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కారం కానుంది. బుధవారం చంద్రుడి చివరి కక్ష్యలోకి చంద్రయాన్ -3 ప్రవేశించింది.
చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని మరోసారి విజయవంతంగా చేపట్టామని ఇస్రో స్పష్టం చేసింది. తాజా చర్యతో కక్ష్య తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయని వెల్లడించింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు ఇదే చివరి కక్ష్య అని పేర్కొంది. తాజాగా వ్యోమనౌక కక్ష్యను 153 km x 163 km లకు తగ్గించామని వివరించింది. దీంతో ఇప్పుడు చంద్రయాన్-3 జాబిల్లిపై 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న కక్ష్యలోకి ప్రవేశించింది.
ఇప్పటివరకు చంద్రయాన్-3 దశలన్నీ విజయవంతమయ్యాయి. వ్యోమనౌకలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను ఆగస్టు 17న నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ సజావుగా సాగితే ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయి చంద్రుడిని చుట్టేస్తుంది. ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెడుతుందని ఇస్రో ప్రకటించింది.
చంద్రయాన్-3ను జులై 14న MVM3-M4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత రోజు తొలిసారి కక్ష్యను పెంచారు. దశలవారీగా 18 రోజుల వ్యవధిలో 5సార్లు కక్ష్యను పెంచారు. 5వ భూకక్ష్య పూర్తైన తర్వాత చంద్రుడి దిశగా ప్రయాణించే ప్రక్రియను చేపట్టారు. ట్రాన్స్ లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్ -3 ఆగస్టు 1న ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. క్రమంగా కక్ష్యలను తగ్గిస్తూ జాబిల్లికి చేరువగా పంపారు.