Janagama : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. జనగామలో రాజకీయ జగడం ముదిరింది. నియోజకవర్గంలో టికెట్ పంచాయితీ తీవ్రమైంది. బీఆర్ఎస్లో టికెట్ కొట్లాటతో వర్గపోరు భగ్గుమంటోంది. జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని ఈ సారి పక్కకు పెడతారని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో MLC పల్లా రాజేశ్వర్రెడ్డిని బరిలో నిలుపుతారని అంటున్నారు. ముత్తిరెడ్డికి భూవివాదాలు, కూతురు విమర్శలు ప్రతికూలంగా మారాయని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముత్తిరెడ్డికి టికెట్ కష్టమేనని జనగామ బరిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉంటారని మరికొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జడ్పీ ఛైర్మన్, ఓ జెడ్పీటీసీతో ఫోన్ మాట్లాడిన ఆడియో రికార్డ్ వైరల్ అయింది. ముత్తిరెడ్డికి టికెట్ కష్టమేనని, పల్లా రాజేశ్వర్రెడ్డి బరిలో దిగుతారని ఆ ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్టు ఆడియోలో ఉంది.
టికెట్ విషయంపై ముత్తిరెడ్డి కూడా స్పందించారు. టికెట్ మళ్లీ తనకే వస్తుందని పలు వేదికలపై చెబుతున్నారు. కేసీఆర్ తనకు హామీ ఇచ్చారని అంటున్నారు. అలాగే తాజాగా ముత్తిరెడ్డికి మద్దతుగా కూడా సర్పంచులు మాట్లాడుకున్న ఆడియో రిజీల్ అయింది. పల్లాకు వ్యతిరేకంగా, ముత్తిరెడ్డికి అనుకూలంగా అందులో సర్పంచ్లు మాట్లాడుకున్నట్టు ఉంది.
ముత్తిరెడ్డి, పల్లా అనుచరులు పరస్పరం పోటాపోటీగా ఆడియోలు రిలీజ్ చేస్తున్న వేళ… జనగామ రాజీయాలు వేడెక్కాయి. ఎవరికి వారు టికెట్ తమకే అంటూ ప్రజల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక అధిష్ఠానం మనసులో ఏముందో తేలాల్సి ఉంది.