హిమాచల్ ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మండీలో బియాస్ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండీ బస్టాండ్ మునిగిపోయింది. ప్లాట్ఫ్లామ్ల పైకి వరద నీరు చేరింది. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు 56 మంది మృత్యవాత పడ్డారు.
సిమ్లాలోని సమ్మర్ హిల్, ఫాగ్లీలో కొండచరియలు విరిగిపడ్డాయి.ఈ ఘటనల్లో 19 ప్రాణాలు కోల్పోయారు. సమ్మర్ హిల్ ప్రాంతంలోని శివాలయంపై కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజా మరో 3 మృతదేహాలను బయటకు తీశారు. శిథిలాల కింద మరో పది మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.
సిమ్లాలోనూ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 8ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. ఇళ్లు కూలిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కృష్ణానగర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వర్షాలు, వరదల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆగస్టు 19 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాలున్నాయి. అందులో 11 జిల్లాల్లో 857 రోడ్లు బ్లాక్ అయ్యాయి. 4,285 ట్రాన్స్ఫార్మర్లులో సమస్యలు తలెత్తాయి. 889 చోట్ల నీటి సరఫరాకు ఇబ్బంది కలిగిందని అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాల సీజన్ లో జూన్ 24 నుంచి ఆగస్టు 14 వరకు రూ.7,171 కోట్ల ఆస్తినష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వ అంచనా వేసింది.
మరోవైపు ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో సోమవారం నుంచి వర్షాల వల్ల ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు.