యమునా నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. రెండ్రోజులుగా ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. కొండ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా యమునా నదిలో ఉద్ధృతి పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో నీటిమట్టం 205 మీటర్లు దాటింది.
గత నెలలో దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. యుమునా పరవళ్లు తొక్కడంతో హస్తిన అతలాకుతలమైంది. తాజాగా మరోసారి నదిలో ప్రవాహం అంతకంతకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. యుమునా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదిలో ప్రవాహం భారీగా పెరిగింది.
ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద 204.50 మీటర్ల ప్రమాద స్థాయి దాటిందని కేంద్ర జల సంఘం పేర్కొంది. పాత రైల్వే వంతెన వద్ద సోమవారం సాయంత్రం 3 గంటలకు 203.48 మీటర్ల నీటిమట్టం నమోదైంది. మంగళవారం రాత్రికి నీటి మట్టం 205.33 మీటర్ల చేరింది. ఆ తర్వాత నీటిమట్టం 205.39 మీటర్లకు పెరిగింది.
హర్యానాలోని యమునా నగర్ హత్నీకుండ్ బ్యారేజీ నుంచి 30 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి మరోసారి వరద ముప్పు పొంచిఉంది. ఇప్పటికే వరదలపై వ్యవసాయ, వరద నియంత్రణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జులై నెలలో వచ్చిన వరదల తీవ్రతతో పోల్చితే కొంచె తక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యమునా నదిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశముంది.