RajBhavan: ఏపీ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం జగన్ సతీసమేతంగా విచ్చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు.
గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇదే తొలి ఎట్ హోం ప్రోగ్రామ్. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ సైతం హాజరయ్యారు. వారు ముగ్గురు కాసేపు కులాసాగా మాట్లాడుకున్నారు. గవర్నర్ సతీమణి, భారతిలు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. పలువురు మంత్రులు, వైసీపీ నేతలు, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తదితరులు గవర్నర్ ఇచ్చిన తేనీటివిందును స్వీకరించారు. విశాఖ పర్యటన కారణంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఎట్ హోమ్కు హాజరుకాలేదు.
ఏపీలో అట్టహాసంగా ఎట్హోమ్ జరిగితే.. తెలంగాణ రాజ్భవన్ మాత్రం రాజకీయ అలకలకు వేదికగా మారింది. సీఎం కేసీఆర్ ఎట్హోమ్కు ఈసారి కూడా డుమ్మా కొట్టారు. గవర్నర్ తమిళిసైతో విభేదాలను మరోసారి బహిరంగంగా చాటారు. ప్రగతిభవన్, రాజ్భవన్ మధ్య గ్యాప్ అలానే ఉందనే మెసేజ్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే హాజరయ్యారు.
ఇటీవల రాష్ట్రపతి రాక సందర్భంగా సీఎం, గవర్నర్ పలకరించుకున్నారు. ఆ తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణస్వీకారానికి రాజ్ భవన్కు వెళ్లారు సీఎం కేసీఆర్. అటు, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో.. వాళ్లిద్దరి మధ్య సఖ్యత కుదిరిందేమోనని అనుకున్నారు. కానీ, అంతలేదు.. వార్ కంటిన్యూ అనేలా.. సీఎం కేసీఆర్ ఎట్హోమ్కు గౌర్హాజరు అయ్యారు. తెలంగాణ సీఎస్, ఇతర ఉన్నతాధికారులు మాత్రమే రాజ్భవన్ ఇచ్చిన తేనీటివిందులో అటెండెన్స్ వేసుకున్నారు.
కేసీఆర్ మాత్రమే కాదు.. మంత్రులు, బీఆర్ఎమ్ ఎమ్మెల్యేలు సైతం ఎట్హోమ్కు డుమ్మా కొట్టారు. గతంలో కేసీఆర్ రాకపోయినా.. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చేవారు. ఈసారి వారెవరూ రాలేదు. మరో విషయం ఏంటంటే.. బీఆర్ఎస్ నేతలే కాదు కాంగ్రెస్ నాయకులెవరూ రాజ్భవన్కు రాలేదు. బీజేపీ అగ్రనేతలు సైతం గైర్హాజరు అయ్యారు. ఇలా పొలిటికల్ సందడి లేకపోవడంతో.. రాజ్భవన్లో జరిగిన ఎట్హోమ్ వెలవెలపోయింది.