Floods: ఓ వైపు దేశమంతా స్వాతంత్ర్య దినోత్సవ సంబురాలు జరుపుకుంటుంటే.. ఆ రాష్ట్రం మాత్రం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మమ అనిపించింది. కారణం భారీ వర్షాలు.. విరిగి పడుతున్న కొండచరియలు.. ధ్వంసమవుతున్న ఇళ్లు.. కుండపోత వర్షాల దెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం. మనాలీలో జరగాల్సిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు భారీ వర్షాల కారణంగా సిమ్లాకు షిఫ్ట్ అయ్యాయి. ఆ రాష్ట్ర సీఎం సుఖ్వీందర్ సింగ్ కూడా జెండాను ఎగురవేసి వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను.. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో నెలకొన్న దారుణ పరిస్థితులు ఇవి.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో కురుస్తున్న అతి భారీ వర్షాలు.. వాటి వల్ల ఉప్పొంగిన వరదలు, కూలుతున్న కొండచరియల కారణంగా రెండు రోజుల వ్యవధిలో 54 మంది మరణించారు. ఇందులో ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే 51 మంది మరణించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సిమ్లాలోని శివుని ఆలయం కుప్పకూలిన ఘటనలో మరో ఇద్దరి మృతదేహాలను వెలికి తీశాయి రెస్క్యూ టీమ్స్. ఆ ప్రాంతంలో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక యునెస్కో నుంచి వరల్డ్ హెరిటేజ్ గుర్తింపు పొందిన సిమ్లా-కల్కా రైల్వే రూట్ కూడా కొండ చరియలు విరిగి పడటంతో కొట్టుకుపోయింది. ఓ 50 మీటర్ల పాటు రైల్వే ట్రాక్ గాల్లో వేలాడుతుంది. ఈ ట్రాక్ను పునురుద్దరించడం ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదంటున్నారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా దాదాపు 10 వేల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
హిమాచల్లోని పరిస్థితులపై ఆరా తీసిన కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకి రావొద్దని ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ విజ్ఞప్తి చేశారు. నది ఒడ్డున నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారంతా వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటకులెవరూ రాష్ట్రానికి రావొద్దని తెలిపారు సీఎం సుఖ్వీందర్ సింగ్.
రెస్క్యూ ఆపరేషన్స్లో SDRF, NDRFతో పాటు ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. అయితే ఇప్పటికే పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నగా.. భారత వాతావరణశాఖ పిడుగు లాంటి వార్తను చెప్పింది. మరో నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హిమాచల్, ఉత్తరాఖండ్లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
కొండ చరియలు విరిగి పడటంతో ఇప్పటికే బద్రీనాథ్, కేదార్ నాథ్, గంగోత్రికి వెళ్లే హైవేలు మూతపడ్డాయి. ముందుజాగ్రత్తగా రెండు రోజుల పాటు చార్ధామ్ యాత్రను ప్రభుత్వం నిలిపివేసింది.