Pawan Kalyan : వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి ఘాటు విమర్శలు గుప్పించారు. మంగళగిరిలో జనసేన వీర మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న మహిళలు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో మహిళల పాత్ర ఉందని జనసేనాని చెప్పారు. అప్పట్లో రాజ్యాగం కోసం 15 మంది మహిళలు పని చేశారని గుర్తు చేశారు.
సీఎం వైఎస్ జగన్ పాలన అస్తవ్యస్తంగా ఉందని పవన్ విమర్శలు గుప్పించారు. మహనీయుడు పొట్టి శ్రీరాములు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడా పొట్టి శ్రీరాములు విగ్రహం, ఫోటోలు కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సీఎం జగన్ ఫొటోలు కనిపిస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రజల కోసం బలిదానం చేసిన మహనీయులను గౌరవించుకోవాలని ప్రభుత్వానికి పవన్ సూచించారు.
ఏపీ మహిళలు అదృశ్యం అంశాన్ని జనసేనాని మరోసారి ప్రస్తావించారు. ఇది చాలా పెద్ద వ్యవహారమని చెప్పారు. సీఎం వైెఎస్ జగన్ నివసించే తాడేపల్లి ఏరియాలో ఎక్కువ క్రైమ్ రేట్ ఉందని వెల్లడించారు. ఆ ప్రాంతంలో గ్యాంగ్ రేప్ లు జరిగాయని వివరించారు. చాలామంది హత్యలకు గురయ్యారని అన్నారు. ఈ ఘటనలపై మహిళా కమిషన్ మాత్రం మాట్లాడదని మండిపడ్డారు.
మహిళల రక్షణకు జనసేన భరోసా ఇస్తుందని పవన్ అన్నారు. జనసేన తరఫున ప్రజాకోర్టు కార్యక్రమం చేపడతామని పవన్ వెల్లడించారు.