Revanth Reddy : తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతులు, నిరుద్యోగుల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గాంధీ భవన్లో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న రేవంత్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ఇస్తున్న హామీలతో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని రేవంత్ అన్నారు. అందుకే ఇప్పుడు హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సరికొత్త సంక్షేమ పథకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ నియంతృత్వ వైఖరి అనుసరిస్తున్నారని రేవంత్ విమర్శలు గుప్పించారు.
మరోవైపు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై కాంగ్రెస్కు స్పష్టమైన విధానం ఉందని ఓ కార్యక్రమంలో జరిగిన చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దామాషా ప్రకారం వర్గీకరణ ఎలా చేయాలో తమకు తెలుసన్నారు. కాంగ్రెస్ చిత్తశుద్ధిపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎవరి వకాల్తాలు తమకు అవసరం లేదన్నారు. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.