Suicide : ఆ యువకుడు చిన్నప్పటి నుంచి చదువులో టాపర్. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. భవిష్యత్ పై ఎన్నో ఆశలతో చదువే లోకంగా బతికాడు. తీరా రిజల్ట్ వస్తుందనుకున్న సమయంలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం బొత్తల తండాలో ఈ విషాదం జరిగింది. గుగులోత్ రాజ్ కుమార్ పదో తరగతిలో టైన్ బై టెన్ జీపీఏ సాధించాడు. ఇంటర్ లో వెయ్యికి 989 మార్కులు తెచ్చుకున్నాడు. వరంగల్ నిట్ లో 85 శాతం మార్కులతో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
2020 నుంచి ఫ్రెండ్స్ తో ఉంటూ AEE, Groups I, II, IV ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యాడు రాజ్ కుమార్. ఈ ఏడాది జనవరి 22న TSPSC నిర్వహించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ పరీక్ష రాశాడు. ఓపెన్ క్యాటగిరీలోనే జాబ్ గ్యారెంటీ అని తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకుని సంబరపడిపోయాడు. కానీ రాజ్ కుమార్ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. పేపర్ లీక్ అయిందన్న సమాచారంతో కుంగిపోయాడు. ఇన్నేళ్ల కష్టం వృధా అయిందని కుమిలిపోయాడు.
ఈ ఏడాది మే 21, 22 తేదీల్లో మరోసారి AEE ఎగ్జామ్ నిర్వహించింది TSPSC. మళ్లీ పరీక్ష రాశాడు రాజ్ కుమార్. కానీ ఇప్పుడు ఆ మనోధైర్యం లేకుండా పోయింది. ఉద్యోగం వస్తుందో, రాదో అని మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరు లేని సమయం లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కిన రాజ్ కుమార్ ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో రాజ్ కుమార్ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. చేతికి అందివచ్చిన కొడుకును విగతజీవిగా చూసి తట్టుకోలేకపోతున్నారు.
తెలంగాణలో పేపర్ లీక్ ఘటన అభ్యర్థులపై ఎంతటి ప్రభావం చూపిందో రాజ్ కుమార్ ఉదంతమే నిదర్శనం. పరీక్షల నిర్వహణా వైఫల్యంతో నిండు జీవితం బలవ్వాల్సి వచ్చింది. ఒకే పరీక్ష మళ్లీ మళ్లీ రాయాల్సి రావడం, మనోవేదన, మానసిక సంఘర్షణను అర్థం చేసుకునేదెవరు? రాజ్ కుమార్ మృతికి బాధ్యత ఎవరిది? దీనికి సమాధానం చెప్పేదెవరు? రాజ్ కుమార్ తల్లిదండ్రుల కడుపుకోతకు జవాబిచ్చేదెవరు?