KCR : హైదరాబాద్ గోల్కొండ కోటలో ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన విజయాలు వివరించారు. దేశంలో వనరులు చాలా ఉన్నాయన్నారు. పాలకుల అసమర్థతతో వాటిని సరిగ్గా వినియోగించుకోవడం లేదన్నారు. దేశం ఆశించిన లక్ష్యాలను ఇంకా చేరుకోలేదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రజల ఆశలు , అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.
సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని కేసీఆర్ అన్నారు. అప్పట్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ఆ కష్టాల నుంచి రైతులను గెట్టేక్కించామన్నారు. తాగు, సాగు నీటి కష్టాలు తీరిపోయాయన్నారు. సాగునీటి రంగంలో స్వర్ణయుగం వచ్చిందని చెప్పారు. ఇప్పడు తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ టాప్ లో ఉందని వెల్లడించారు. నిరంతరం విద్యుత్ సరఫరాతో రాష్ట్రం వెలుగుతోందన్నారు. ఒకప్పుడు రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. ఇప్పవరకు రూ. 37 వేల కోట్ల రైతుల రుణమాఫీ చేశామన్నారు. సమైఖ్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణలో 15వ స్థానంలో ఉంటే ఇప్పడు అగ్రస్థానానికి పోటీ పడుతోందని చెప్పారు.
హైదరాబాద్ లో నేటి నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేపడుతున్నామని కేసీఆర్ తెలిపారు.
అంతకు ముందు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో అమర వీరుల స్తూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పించారు. ప్రగతిభవన్లో నిర్వహించిన ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు.