Jagan : ఏపీలో స్వాత్రంత్య దినోత్సవం ఘనంగా జరుగుతోంది. విజయవాడ
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఉత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాలు ప్రదర్శించారు.
వైసీపీ పాలనలో సాధించిన విజయాలను జగన్ వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి పౌర సేవలను ఇంటింటికి తీసుకెళ్లగలిగామన్నారు. గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇలా 50 నెలల్లో గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చామన్నారు.
సంక్షేమ పథకాలన్నీ మహిళలకే ఇస్తున్నామని సీఎం చెప్పారు. రూ. 2 లక్షల 31 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించామన్నారు. ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపించామని సీఎం జగన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ.. పాలనా వికేంద్రీకరణతో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించామన్నారు. 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకూడదని అడ్డుకోవడం కూడా అంటరానితనమే సీఎం జగన్ స్పష్టం చేశారు. పేదల బతుకులు బాగుపడే వరకు యుద్ధం చేస్తామన్నారు. 98.5 శాతం హామీలు అమలు చేశామని వివరించారు.
రైతులకు పెట్టుబడి కోసం రైతు భరోసా అందిస్తున్నామని జగన్ తెలిపారు. విత్తనం నుంచి అమ్మకం వరకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నామన్నారు. రైతులను ఆదుకునేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని వివరించారు. పాల వెల్లువ ద్వారా పాడి రైతులకు అదనంగా ఆదాయం వచ్చేలా చేశామన్నారు. మూతపడిన చిత్తూరు డైరీకి జీవం పోశామని తెలిపారు. భూవివాదాలకు పరిష్కారం కోసం సమగ్ర సర్వే చేపట్టామన్నారు.
పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయన్న సీఎం.. 2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. వెలిగొండలో మొదటి టన్నెల్ పూర్తి చేశామని.. రెండో టన్నెల్ పనులు త్వరలోనే పూర్తవుతుందని చెప్పారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ వివరించారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామన్నారు. గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగీష్ మీడియం అమలు చేస్తున్నామని చెప్పారు.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.