Modi Speech : వెయ్యి ఏళ్ల బానిసత్వానికి తెరదించుతూ 1947లో స్వతంత్రాన్ని సంపాదించామని ప్రధాని మోదీ అన్నారు. అమృతోత్సవంలో మనం చేపట్టే చర్యలు వెయ్యి ఏళ్లపాటు స్ఫూర్తిగా నిలుస్తాయని స్పష్టం చేశారు. మణిపూర్ లో పరిణామాలను ప్రస్తావించారు. దేశంలో కొన్ని ప్రాంతాలతోపాటు మణిపూర్ లో హింస చెలరేగిందని గుర్తు చేశారు. మణిపూర్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నామని తెలిపారు. అక్కడ పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్నారు. మణిపూర్ ప్రజలకు దేశం అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు.
ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని అన్నారు. మన దేశంపై ప్రపంచానికి విశ్వాసం ఏర్పడిందని చెప్పారు. విదేశాలకు ఎగుమతులు భారీగా పెరిగాయని వెల్లడించారు. జీ-20 సదస్సు నిర్వహించే అవకాశం మనకు దక్కిందన్నారు. పదేళ్లుగా భారత్ గొప్పతనాన్ని ప్రపంచం గుర్తిస్తోందని మోదీ అన్నారు.
దేశంలో యువశక్తి అద్భుతంగా ఉందని మోదీ అన్నారు. అవకాశాలకు హద్దులు లేవని స్పష్టం చేశారు. డిజిటల్ ఇండియా దిశగా దూసుకెళ్తున్నామన్నారు. దేశంలోని యువత శక్తి, సామర్థ్యాలపై తనకు ఎంతో విశ్వాసం ఉందని చెప్పారు.
బలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడే సంస్కరణలు సాధ్యమని మోదీ స్పష్టం చేశారు. ప్రతి సంస్కరణ జన సంక్షేమం కోసమే చేస్తున్నామని వివరించారు. సత్తా చాటు , మార్పు చెందు అన్న పద్ధతిలో దేశం ముందడుగు వేస్తోందని తెలిపారు. సంస్కరణలకు జలశక్తి శాఖ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రతి ఇంటికి శుద్ధనీరు అందిస్తున్నామని చెప్పారు. పశు, మత్స్య సంపద అభివృద్ధికి కొత్తబాటలు తెరుచుకున్నాయన్నారు. సహకార రంగ అభివృద్ధికి కొత్త మంత్రిత్వశాఖ ఏర్పాటు చేశామని చెప్పారు. సాగు రంగంలో తెచ్చిన సంస్కరణలు రైతులకు లబ్ధి చేకూర్చాయన్నారు. యూరియాపై రూ. 10 లక్షల కోట్ల రాయితీ రైతులు లభిస్తోందని తెలిపారు.
2014లో బీజేపీ అధికారంలో వచ్చేటప్పటికి కుంభకోణాలు రాజ్యమేలుతున్నాయని మోదీ ఆరోపించారు. ఆ సమయానికి ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున ఉందన్నారు. తమ ప్రభుత్వం బలమైన ఆర్థిక విధానాలు, పారదర్శక పాలనతో దేశానికి కొత్త శక్తిని ఇచ్చిందని స్పష్టం చేశారు. పథకాల అమలు లోపాలు అరికట్టామన్నారు. ముద్రా యోజనతో ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చేశామని మోదీ చెప్పారు. ఈ సంస్థలు కొత్త ఉద్యోగాలను సృష్టించాయన్నారు. నిరంతర అభివృద్ధి నవీన మధ్యతరగతిని సృష్టించిందని తెలిపారు.
కొత్త పథకాలను మోదీ ప్రకటించారు. వచ్చే నెలలో విశ్వకర్మ యోజన ప్రారంభిస్తున్నామని తెలిపారు. ధరల పెరుగుదల తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పాత విధానాలు పక్కన పెట్టి కొత్త లక్ష్యాలతో ముందుకెళుతున్నామని స్పష్టం చేశారు. మధ్యతరగతి సొంతింటి కలను నెరవేర్చేందుకు కొత్త పథకం తీసుకురాబోతున్నామని ప్రకటించారు. బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే పథకం తీసుకొస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్య తరగతి ప్రజలు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని వివరించారు.