Telangana: అప్పుడెప్పుడో నాలుగున్నరేళ్ల క్రితం ఇచ్చిన హామీ. ఎన్నికల వేళ రైతులకు లక్ష లోపు వరకు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించింది. నిజమే అనుకుని అన్నదాతలు కేసీఆర్ను నమ్మి ఓటేశారు. గెలిచాక.. హామీ తీసి గట్టు మీద పెట్టేశారు. ఏళ్లు గడిచినా.. రుణమాఫీ మాత్రం చేయలేదు. వడ్డీల మీద వడ్డీలు పెరిగి.. అసలు కాస్తా డబుల్ అయింది. రైతులు లబోదిబో అంటున్నా.. సీఎం కేసీఆర్ పట్టించుకున్నది లేదు.
మళ్లీ ఎన్నికలు వస్తున్నాయ్. నాలుగైదు నెలలు మాత్రమే టైమ్ ఉంది. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ విస్తృతంగా పోరాడుతోంది. అన్నదాతల తరఫున సర్కారును గట్టిగా నిలదీస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. దెబ్బకు కేసీఆర్కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్టుంది. పెండింగ్లో ఉన్న రుణమాఫీ ఫైల్ దుమ్ము దులిపారు. నాలుగేళ్ల తర్వాత రుణమాఫీ అమలుపై నిర్ణయం తీసుకుంటూ ఇటీవలే ప్రకటన రిలీజ్ చేశారు. తాజాగా, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. రైతులందరికీ రూ.లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేసింది సర్కారు.
రూ.99,999 వరకు రుణాలున్న రైతులందరీ రుణమాఫీ నిమిత్తం నిధులు రిలీజ్ చేసింది. ఒక్కరోజే ఏకంగా 10,79,721 మంది రైతులకు.. రూ.6,546.05 కోట్ల రుణాలను చెల్లించింది. ఇప్పటివరకు 16.66 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇందుకోసం రూ.7,753 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఇదేదో నాలుగేళ్ల క్రితమే చేసుంటే.. ఇన్నేళ్లు రుణాలపై వడ్డీలు పెరిగి.. అప్పులపాలు కాకుండా ఉండేవారమని వాపోతున్నారు రైతులు. అందుకే, రుణమాఫీ చేసిన సంతోషమే కనిపించట్లేదు అన్నదాతల్లో.