AP: ఉత్తరాంధ్రా భూములను వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జగన్ పాలనలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. అనకాపల్లి జిల్లా విసన్నపేట భూములు సందర్శించారాయన.
పర్యావరణానికి విఘాతం కలిగించేలా.. అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. విసన్నపేటలో వేస్తున్న వెంచర్లకు ఎలాంటి అనుమతి లేదని.. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై కేంద్ర పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఉత్తరాంధ్రలో యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేవని మండిపడ్డారు పవన్ కల్యాణ్.
మరోవైపు, తప్పుడు మాటలు, అసత్యాలు కట్టిపెట్టాలని పవన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పేర్ని నాని. సీఎం జగన్ను విమర్శించడమే పవన్ కల్యాణ్ పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ పాలనను మళ్లీ తెస్తాననే దమ్ముందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర కిరాయికి ఒప్పుకున్నాడు కాబట్టే.. కూలీకి తగ్గట్టుగా పనిచేయడమే పవన్కు తెలుసంటూ విమర్శించారు.
పవన్ కల్యాణ్ 25 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేయడన్నారు పేర్ని నాని. ముఖ్యమంత్రి అవుతానంటావ్.. ఎన్ని సీట్లలో పోటీ చేస్తావ్? అంటూ ప్రశ్నించారు. జగన్ గురించి కాకుండా.. కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక హోదా తీసుకురావడం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం లాంటి పనులు చేయొచ్చుగా అని పవన్కు సూచించారు పేర్ని.