Shejal: ఆరిజన్ డెయిరీ నిర్వహకురాలు శేజల్ మరోసారి ఆందోళనకు దిగారు. బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని నిలదీశారు. పోలీసులు కలుగజేసుకుని ఆమెను స్టేషన్కు తరలించారు.
తాను ఎవరికీ ఇబ్బంది కలుగకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే.. ఎలా అడ్డుకుంటారని శేజల్ నిలదీసింది. అన్యాయం జరిగినప్పుడు రాని పోలీసులు.. ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తే మాత్రం త్వరగా వస్తారని విమర్శించింది. అంతేకాకుండా తనపై 2012 నుంచే కేసులు ఉన్నాయంటూ అడ్డగోలుగా వాగుతున్నారని వాపోయింది. 2012నాటికి తాను 6 వ తరగతి చదువుతున్నానని తెలిపింది. కావాలనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలతో దాదాపు 7 నెలలుగా శేజల్ ఆందోళన చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలోనూ ఆమె గళం వినిపించారు. ఇటీవల జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి గుడి దగ్గర షేజల్ స్పృహకోల్పోయి పడిపోయింది. అయినా ఇంతవరకూ ప్రభుత్వం నుంచి గానీ ఎమ్మెల్యే నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.