hyderabad express : ఘరానా దొంగలు రైళ్లను టార్గెట్ చేస్తున్నారు. దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవలకాలంలో ఇలాంటి నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో దొంగలు హల్ చల్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి ప్రయాణికులు గాఢ నిద్ర ఉన్న సమయంలో హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ప్రెస్లోకి చొరబడ్డారు. ప్రయాణికులు తేరుకునే లోపు బంగారు తీసుకుని పారిపోయారు.
నెల్లూరు జిల్లా ఉలవపాడు- తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య దొంగలు చోరీకి పాల్పడ్డారని రైల్వే పోలీసులు తెలిపారు. ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద హైదరాబాద్ ఎక్స్ప్రెస్ను ఆరుగురు దుండగులు నిలిపివేశారు. ఆ తర్వాత నిందితులు ఎస్-1, ఎస్-2, ఎస్-3 బోగీల్లోకి చొరబడ్డారు. మహిళల మెడల్లోని 30 తులాల బంగారాన్ని అపహరించారు.
ఆ తర్వాత హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నచార్మినార్ ఎక్స్ప్రెస్లోనూ దోపిడీకి దుండగులు ప్రయత్నించారు. ఆ రైలును తెట్టు సమీపంలో నిలిపివేశారు. రైలులోకి ప్రవేశించి చోరికి పాల్పడేందుకు ప్రయత్నించారు. రైలులో భద్రతా ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులపై రాళ్లు రువ్వి దుండగులు పరారయ్యారు. ఆ తర్వాత చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్కడ నుంచి చెన్నైకి వెళ్లింది. ప్రయాణికుల ఫిర్యాదుతో ఒంగోలులో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఇటీవల కాలంలో రైళ్లు నేరాలకు కేంద్రాలకు మారుతున్నాయి. దోపిడి దొంగలు ప్రయాణికులపై దాడులకు పాల్పడిన ఘటనలు వెలుగుచూశాయి. ఇలాంటి ఘటనలతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.