తిరుమలలో చిరుత బోనులో చిక్కింది. ఇటీవల అలిపిరి నడకమార్గంలో 6 ఏళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు చిరుతను బంధించే చర్యలు చేపట్టారు. బాలికపై దాడి చేసిన ప్రాంతంలో మూడు బోన్లు ఏర్పాట్లు చేశారు. చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు.
చిరుత రెండు రోజులుగా ఐదు ప్రాంతాల్లో సంచరించినట్లు గుర్తించారు . ఈ క్రమంలోనే తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక లక్షిత తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. నెలన్నర క్రితం నడకమార్గంలోనే ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటన తర్వాత చిరుతను బంధించారు. కల్యాణ్ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
చిరుత దాడి ఘటన తర్వాత టీటీడీ అప్రమత్తమైంది. నడకదారిలో ఆంక్షలు విధించింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతిస్తోంది. అయితే తాజాగా తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నడకదారిలో చిరుత సంచారించినట్లు చెబుతున్నారు భక్తులు. అయితే అధికారులు కూడా చిరుత కదలికలు ఉన్నట్లు నిర్థారించారు.