ఏపీ రాజకీయాలపై రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమాపై వర్మ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఈ మూవీలో ఎవరూ చూపించని నిజాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందే సినిమా రెండు పార్టులుగా విడుదలవుతుందని ప్రకటించారు. సినిమాలో వివేక హత్య ఘటన ఉంటుందని వెల్లడించారు. నిందితులు కూడా దొరకుతారని తెలిపారు. వ్యూహం సినిమాలో నిజాలు చూపిస్తామని వర్మ అన్నారు.
మరోవైపు ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద దర్శకుడు రామ్గోపాల్ వర్మ షూటింగ్ చేయడంపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అభ్యంతరం తెలిపారు. ఆయన పవిత్ర సంగమం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. జలహారతి ఇచ్చారు. పట్టిసీమ పథకం దండగని ప్రచారం చేసిన వైసీపీ నాయకులు ఏ మొహం పెట్టుకొని సినిమా షూటింగ్లు చేయిస్తున్నారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే పట్టిసీమ పూర్తి చేశామన్నారు. 13 లక్షల ఎకరాలకు నీరు అందించామని చెప్పారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులను తిరిగి నిర్మిస్తామన్నారు.
ప్రాజెక్టులపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్లను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తిలకించారని దేవినేని ఉమా చెప్పారు. రాంగోపాల్ వర్మకు దమ్ముంటే టీడీపీ నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలని సవాల్ విసిరారు. దేవినేని ఉమా వ్యాఖ్యలపై ఆర్జీవీ స్పందించారు. ఉమాకు నచ్చినట్టు తానెందుకు తీస్తానని కౌంటర్ ఇచ్చారు.