Group2 : టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించింది. నవంబర్ కు ఎగ్జామ్స్ వాయిదా వేయాలని శనివారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈ పరీక్షల రీషెడ్యూల్ చేసిన తేదీలను వెల్లడించింది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్ -2 ఎగ్జామ్స్ నిర్వహిస్తామని పేర్కొంది.
తెలంగాణలో మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు సగటున 705 మంది పోటీ పడుతున్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్- 2 పరీక్షలు జరగాలి.
ఆగస్టు నెలలో గురుకుల టీచర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్, స్టాఫ్నర్స్, ఎస్ఎస్సీ, ఐబీపీఎస్ లాంటి పోటీ పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్- 2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. నిరసన బాట పట్టారు. ఈ ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. గ్రూప్-2 అభ్యర్థులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎగ్జామ్స్ ను రీషెడ్యూల్ చేసింది.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శితో సమావేశమయ్యారు. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించారు. తాజా పరిస్థితులను సీఎం కేసీఆర్ కు నివేదించారు. సీఎం ఆదేశాలతో పరీక్షలను నవంబర్ కు ప్రభుత్వం వాయిదా వేశారు. తాజాగా కొత్త తేదీలను ఖరారు చేశారు.