తెలంగాణలో కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతోంది. హస్తంగూటికి చేరుకోవడానికి చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్నారు. తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరతానని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చంద్రశేఖర్ నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. చంద్రశేఖర్ను కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కలిసి పని చేద్దామని కోరారు.
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని రేవంత్రెడ్డి విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు రెండు పార్టీలు తీరని అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదల హక్కుల కోసం కాంగ్రెస్ ఫైట్ చేస్తోందని తెలిపారు.
కొన్నిరోజుల క్రితం ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఆయన చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు బలం పెరిగింది. ఇటీవల మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన చేరిక మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీకి బలాన్ని పెంచింది.
ఇంకా చాలామంది నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీకి షాకిచ్చే యోచనలో కొంతమంది నేతలు ఉన్నారని తెలుస్తోంది. వారు సరైన సమయం కోసం వేచిచూస్తున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అన్నీ పార్టీల నేతల చూపు కాంగ్రెస్ పైనే పడింది. గతంలో బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న నేతలు వెనకడుగు వేశారు. బీజేపీలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే సమయానికి కారు నుంచి చాలా మంది నేతలు దిగేపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి నేతలు హస్తంగూటికే చేరే అవకాశం ఉంది.