జనసేన అధినేత చేసిన విమర్శలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. పవన్ కు కనీస పరిజ్ఞానం లేదని విమర్శించారు. మాస్టర్ ప్లాన్ అంటే ఏంటో తెలుసా? అని ప్రశ్నించారు. తాను విశాఖ వదిలి వెళ్లిపోతానని ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. తన మాటలను జనసేనాని వక్రీకరించారని మండిపడ్డారు. తనను రాజీనామా చేయమనడానికి పవన్ ఎవరు? అని గట్టిగా నిలదీశారు. జనసేన అధ్యక్షుడు పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి.. ఎంపీగా గెలిచిన తనపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పవన్ ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు బూట్లు నాకుతున్నారంటూ ఎంపీ ఎంవీవీ ఘాటు విమర్శలు చేశారు. బ్రో సినిమాతో డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోయారని తెలిపారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై జనసేన అధినేత ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. విశాఖను ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాలని కోరారు.
తాను సీఎం అభ్యర్థి అని చంద్రబాబుతో చెప్పించగలవా? అంటూ పవన్ కు ఎంపీ సవాల్ విసిరారు. జనసేనాని తన పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని సెటైర్లు వేశారు. రాజకీయ నాయకుడి ఉండాల్సిన లక్షణం ఒక్కటీ పవన్కు లేదని విమర్శించారు. సినిమాల్లో మాదిరిగా గంతులేస్తే నాయకులు కాలేరని చురకలు అంటించారు. వీధి రౌడీకి, పవన్కు తేడా లేదని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు.
విశాఖ పర్యటనలో ఉన్న జనసేనాని శనివారం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను టార్గెట్ చేశారు. గెలిపించిన ప్రజలకు అండగా ఉండాల్సిన ఎంపీ రౌడీ షీటర్లకు భయపడి విశాఖను వదిలి వెళ్లిపోతాననడం సిగ్గుచేటని అన్నారు. వ్యాపారం బాగోలేదని ఇక్కడ నుంచి వెళ్లిపోతానంటారా? అని ప్రశ్నించారు. ఎంపీ అయ్యింది అడ్డగోలుగా వ్యాపారాలు చేసుకోవడానికా? అని గట్టిగా అడిగారు. ఎంపీ రాజీనామా చేయాలని కోరారు.
వైసీపీ నాయకులు, రౌడీలు ములాఖత్ అయిపోయారని పవన్ విమర్శించారు. విశాఖలో ఎంపీ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేసినా ప్రశ్నించేవారు లేరని అన్నారు. ఎంపీ కూడా రౌడీలకు భయపడుతున్నారంటే ఆయన ఎంత అసమర్థుడో తెలుస్తుందన్నారు. డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసి.. అధికారంలోకి వస్తే ధైర్యం ఎక్కడ ఉంటుందని ఎంపీ ఎంవీవీని ఉద్దేశించి పవన్ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ విమర్శలకు ఎంపీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.