Chandrababu Latest News (AP Political News) : ఏపీలో ఎన్నికలకు మరో 8 నెలల సమయం మాత్రమే ఉంది. ప్రభుత్వం విధానాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, అరాచకాలను జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా లేఖ రాశారు. తనపై దాడులు జరిగిన ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తనపై దాడులు జరగుతున్నాయని ఆరోపించారు.
తనకున్న విశేషాధికారాలతో ఏపీలో పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో తీవ్రమైన, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో రాజ్యాంగ సంస్థలను విధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతున్నారని లేఖలో వివరించారు. న్యాయ, కేంద్ర సంస్థలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ 9 పేజీల లేఖను రాశారు. పలు ఘటనలకు సంబంధించి 75 పేజీల అనుబంధ డాక్యుమెంట్ను కూడా చంద్రబాబు జత చేశారు.
రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ రాయడం ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. ఇప్పటికే టీడీపీ అధినేత రాష్ట్రవ్యాప్తంగా వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందుపెడుతున్నారు. ఏపీ అభివృద్ధి తనతోనే సాధ్యమంటున్నారు. మరోవైపు వైసీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసి జగన్ సర్కార్ పై మరో అస్త్రాన్ని సంధించారు.