Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. నాయకులు స్పీడు పెంచారు. తిరగబడదాం, తరిమికొడదాం.. అంటూ కొత్త నినాదం అందుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజాకోర్టులతో సర్కారుపై పోరుబాట ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు.
ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు సరికొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది తెలంగాణ కాంగ్రెస్. హైదరాబాద్లో ప్రజాకోర్టు నిర్వహించింది. ప్రజాకోర్టు జడ్జీగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య వ్యవహరించారు. బోనులో కల్వకుంట్ల కుటుంబాన్ని నిలబెట్టారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్రావుల కటౌట్లు ఉంచారు. ప్రజాకోర్టులో ఒక్కో అంశంపై.. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను.. ఒక్కో కాంగ్రెస్ నేత ఎండగట్టారు. ఇలాంటి ప్రజాకోర్టులనే తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ.
నెల రోజుల పాటు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ వైఫల్యాలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ప్లాన్ చేశారు హస్తం నేతలు. 12వేల గ్రామాల్లో, 3వేల డివిజన్ స్థాయిలల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశాలు జరపనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు వెళ్లి.. 75 లక్షల కుటుంబాలను పార్టీ నేతలు కలవనున్నారు.
వీలైనంత ఎక్కువ మంది ప్రజల్ని భాగస్వామ్యం చేసేలా మిస్డ్ కాల్ నెంబర్ కూడా ప్రకటించింది. కేసీఆర్ పాలనను వ్యతిరేకించే వాళ్లు.. 7661 889 899 ఫోన్ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి తమ నిరసనను తెలుపొచ్చు. మరోవైపు, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేలా.. పోస్టుకార్డుల ఉద్యమం కూడా ఆరంభించనుంది కాంగ్రెస్. ఇలా పదునైన వ్యూహాలతో కేసీఆర్ సర్కారుపై తిరగబడేలా.. తరిమికొట్టేలా.. ఉద్యమ కార్యచరణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ.