BJP: ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ పెరిగింది. నడ్డా, షా లాంటి అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్కు వచ్చి మరీ జగన్ సర్కారును తిట్టేసి వెళ్లారు. జగన్ను సాఫ్ట్గా డీల్ చేస్తున్న సోము వీర్రాజును తీసేసి.. పురందేశ్వరికి పగ్గాలు అప్పగించారు. ఆమె వచ్చినప్పటి నుంచి వైసీపీపై విమర్శల డోసు మరింత పెరిగింది. జనసేనతో కలిసి బీజేపీ.. అధికార పార్టీపై పోరు పెంచింది.
కట్ చేస్తే.. తెలంగాణ బీజేపీ మాత్రం ఓ విషయంలో జగన్ పాలన గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. పరోక్షంగా తెగ పొగిడేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం చెప్పారు. ఇప్పుడు ప్రచార కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ సైతం అదే అంశం తీసుకొచ్చారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై టీబీజేపీ పెద్ద ఎత్తున పోరాడుతోంది. కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పటి నుంచీ.. ఇళ్ల పంపిణీనే ప్రధాన అజెండాగా ఎంచుకున్నారు. ఆ క్రమంలో కేసీఆర్ సర్కారుపై విమర్శల్లో భాగంగా.. జగన్ ప్రభుత్వాన్ని కంపేర్ చేసి మాటల దాడి చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తోందనేది బీజేపీ మాట. కేంద్ర సహకారంతో ఏపీలో ఇప్పటికే 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి.. పేదలకు అందించారని పదే పదే చెబుతున్నారు. ఏపీలో అలా ఉంటే.. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకూ లక్ష ఇళ్లు కూడా పూర్తి చేయలేదని.. కంప్లీట్ అయిన ఇళ్లను కూడా పంపిణీ చేయట్లేదంటూ సీఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కమలనాథులు. కేసీఆర్ తప్పును చూపించేందుకు.. జగన్ పనితీరును ప్రశంసించేలా బీజేపీ నేతలు మాట్లాడుతుండటం ఆసక్తికరంగా మారింది.
తాజాగా, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలంటూ హైదరాబాద్ ధర్నాచౌక్లో మహాధర్నా చేసింది బీజేపీ. కిషన్రెడ్డి, ఈటల, అర్వింద్ తదితరులు తరలివచ్చి.. కేసీఆర్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చే దమ్ము కేసీఆర్కు లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అబద్దాల పాలన కొనసాగుతోందన్నారు.
ఇక, ఆగస్టు 16, 17 తేదీల్లో బీజేపీ నాయకులంతా బస్తీల సందర్శనకు వెళ్లాలని పార్టీ అధ్యక్షుడు కిషన్రెడ్డి పిలుపు ఇచ్చారు. మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని.. ఈనెల 23, 24న జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళనలు.. సెప్టెంబరు 4న హైదరాబాద్లో విశ్వరూప ధర్నా ఉంటుందని ప్రకటించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందేనని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు డబుల్ డిజిట్గా కూడా రాదన్నారు కిషన్రెడ్డి.