Adilabad : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం డోంగర్ గావ్ గ్రామంలోని హనుమాన్ ఆలయంలో వివాదాస్పదం అవుతోంది. విగ్రహం కళ్లను ఎమ్మెల్యే మాయం చేశారంటూ గ్రామస్తులు ఆందోళన దిగడం చర్చకు దారి తీసింది. నెల క్రితం తమ గ్రామానికి వచ్చిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఆంజనేయ విగ్రహంపై ఉన్న వెండి కళ్లను తీసుకువెళ్లిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే రేఖ నాయక్ దేవుని విగ్రహం మీద ఉన్న కళ్లు తీసుకెళ్లిన రోజు నుంచి గ్రామంలో.. ఏదో ఒక అశుభం జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 10 రోజుల తరువాత గ్రామ పటేల్ మాడవి దేవరావు కంటి చూపు కోల్పోయారు. గతవారం గ్రామ మాజీ పటేల్ పెందుర్ బాబు ఆకస్మాతుగా కంటి చూపుని కోల్పోయారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
ఎమ్మెల్యే రేఖానాయక్ ఆంజనేయస్వామి కళ్లను తీసుకెళ్లడంతోనే తమ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వీరి ఆందోళనకు కాంగ్రెస్ నేత వినోద్ నాయక్ మద్దతు ప్రకటించారు. గుడిలో రేఖనాయక్ చేసిన అపచారం వల్లే గ్రామంలో అనర్ధాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే రేఖానాయక్ ఖండించారు. డొంగర్గాం గ్రామం నుంచి తాను వెండి కళ్లు తీసుకెళ్లిన విషయం వాస్తవమేనన్నారు. త్వరలోనే స్వామివారికి బంగారు కళ్లు చేయిస్తానని ఆమె హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఈ విషయంపై అనవసర రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్ ఆరోపించారు.