విజయవాడ టీడీపీలో మరోసారి ముసలం మొదలైంది. పార్టీ అధినేత లోకేశ్ పాదయాత్ర కొత్త గొడవకు కారణమైంది. విజయవాడ టీడీపీలోని ప్రముఖపాత్ర వహిస్తున్న కేశినేని బ్రదర్స్ మధ్యే పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేపథ్యంలో అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇద్దరి మధ్య చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది.
ఈ నెల 19న లోకేశ్ పాదయాత్ర విజయవాడ పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశిస్తోంది.19 నుంచి 22 వరకూ విజయవాడలోనే పాదయాత్ర జరుగనుంది. నగరంలోని మూడు నియోజకవర్గాలతోపాటు గన్నవరంలో భారీ ఏర్పాట్లు చేయాలని నేతలు నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేశినేని నానికి కాకుండా పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను కేశినేని చిన్నికి అప్పగించడంతో వివాదం మొదలైంది.0
టీడీపీ అధిష్టానమే స్వయంగా కేశినేని చిన్నికి బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కావాలని కేశినేని నానిని సైడ్ చేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై తెలుగు తమ్ముళ్లలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఎంపీ కేశినేని నాని స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
అయితే ఇటీవల ఎంపీ కేశినేని నాని టీడీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నేరుగా పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. దీంతో లోకేశ్ పాదయాత్రలో కేశినేని నాని పాల్గొనడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.