Bear news today telangana(Local news telangana): కరీంనగర్ ప్రజలను హడలెత్తించిన ఎలుగుబంటిని ఎట్టకేలకు అధికారులు పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ ఎలుగుబంటి విజయవంతమైంది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అటవీశాఖ అధికారులు.. శ్రీపురంలో ఎలుగుబంటికి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు.
శుక్రవారం రాత్రి నుంచి కరీంనగర్ నగర శివారుల్లో హల్ చల్ చేస్తున్న ఎలుగు బంటిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రం ప్రయత్నించారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు ఫారెస్టు అధికారులు తొలుత వలలు ఏర్పాటు చేయగా.. చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది. అనంతరం రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా ఎయిర్ గన్తో అటవీశాఖ అధికారులు మత్తు ఇంజక్షన్ ప్రయోగించారు. దీంతో అది రేకుర్తి సమ్మక్క గద్దెల్లోకి పారిపోయింది. అనంతరం అటవీశాఖ అధికారులు గాలింపు ప్రక్రియ ముమ్మరం చేసి.. ఎలుగు బంటిని బంధించారు.
శనివారం ఉదయం కరీంనగర్ నగర శివారుల్లో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. రోడ్డుపై సంచరిస్తూ నగర వాసులను పరుగులు పెట్టించింది. శుక్రవారం రాత్రి బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని రజ్వీ చమాన్ ప్రాంతంలోని ఓ కాలనీలోకి ప్రత్యక్షమైన ఎలుగుబంటి.. శనివారం ఉదయం రేకుర్తిలో నడిరోడ్డుపై సంచరిస్తూ ప్రజలకు కనిపించింది. ఎలుగు బంటిని చూసిన గ్రామస్థులు భయంతో పరుగులు పెట్టారు. దీంతో అటవీశాఖ అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఎలుగుబంటి కోసం హన్మకొండ నుంచి ప్రత్యేకంగా వలలు, ఎయిర్ గన్స్, ఇతర ఎక్విప్ మెంట్ తెప్పించారు.
పోలీసులు, అటవీశాఖ అధికారులు ఎలుగు బంటిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నాలుగు గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు ఎలుగుబంటిని బంధించారు.