వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు. కోఠిలోని హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన.. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ వ్యాఖ్యలను జోడించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఈ రెండూ జరగని ఊరు లేదంటూ రజనీ స్టైల్ లో డైలాగ్ పేల్చారు.
కేసీఆర్ బాటలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలని డీహెచ్ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ కోసం అందరూ కేసీఆర్తో కలిసి అడుగులు వేయాలన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల పాలనలో డెవలప్ మెంట్తోపాటు ఎన్నో స్కీమ్లు ప్రవేశపెట్టారన్నారు. బంగారు తెలంగాణ చివరి దశలో ఉందని తెలిపారు. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలంటే కేసీఆర్ను మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.
హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొత్తగూడెం, హైదరాబాద్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో సీఎం కేసీఆర్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఆయన పొలిటికల్ ఎంట్రీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఓసారి కొత్తగూడెం సభలో డీహెచ్ స్థానిక ఎమ్మెల్యేపైనా వివాదాస్పద కామెంట్స్ చేశారు.
గతంలోనూ కేసీఆర్ కాళ్లు మొక్కి వివాదంలో ఇరుక్కున్నారు డీహెచ్ శ్రీనివాసరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిమ్నా తండాలో నిర్వహించిన పూజల్లో ఆయన పాల్గొనడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఎండు మిరపకాయలు హోమంలో వేస్తూ కనిపించడం కలకలం రేపింది శ్రీనివాసరావు క్షుద్రపూజల్లో పాల్గొన్నారంటూ ప్రచారం జరిగింది. ఈ పూజల తర్వాత తన జన్మధన్యమైందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీఆర్ఎస్ ఓటు వేయాలని బహిరంగంగా ప్రకటించి తెల్ల కోటుపై గులాబీ కండువా వేసుకున్న వ్యక్తిలా మాట్లాడరనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.