తెలంగాణలో గ్రూప్-2 ఎగ్జామ్ వ్యవహారం వివాదంగా మారింది. ఈ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం గ్రూప్-2 పరీక్ష నిర్వహించడానికే మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిరుద్యోగ యువతకు మద్దతుగా నిలుసున్నాయి. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా వేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రవీణ్ కుమార్ ఇంటికి వెళ్లి పోలీసులు కలిశారు. దీక్ష వివరాలు ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత ఆయనను ఇంట్లోనే నిలువరించారు. ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా ఆయన ఇంటికి బీఎస్పీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. అయితే వారిని పోలీసులు ఇంట్లోకి అనుమతించలేదు. పోలీసులు తనను అడ్డుకోవడంతో.. సత్యాగ్రహ దీక్షను ఇంట్లోనే కొనసాగిస్తానని ప్రవీణ్ కుమార్ తేల్చిచెప్పారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేశారు.
మరోవైపు గన్ పార్క్ వద్ద దీక్షకు చేపట్టేందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.దీంతో ఆయన ఇంటి వద్దనే మౌన దీక్ష చేపట్టారు. గ్రూప్-2 పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు గ్రూప్-2 అభ్యర్థులను రెచ్చగొట్టారన్న అభియోగంతో అశోక ఆన్లైన్ అకాడమీ నిర్వహకుడు చైతన్యపురికి చెందిన అశోక్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆయన ఆన్లైన్లో ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
టీఎస్పీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నాకు వ్యూహం రూపొందించారని అశోక్ కుమార్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయన వీడియోలకు ప్రభావితమై కొంత మంది అభ్యర్థులు ధర్నాకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు. గ్రూప్-2 శిక్షణ కేంద్రాల నిర్వాహకులే అభ్యర్థులతో ఆందోళనలు చేయిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఈ వ్యవహారంలో మరో ఆరుగురు శిక్షణ కేంద్రాల నిర్వాహకులు ఉన్నారని పోలీసులు నిర్ధారించారు.