డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పర్యటనలో మంత్రి విశ్వరూప్ ను ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆయనకు టిక్కెట్ దక్కనే ప్రచారం సాగుతోంది. మహిళలకు సున్నా వడ్డీ నిధులు జమ చేసే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ అదే వేదికపై మంత్రి విశ్వరూప్ కు సూచనలు చేయడంపై ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలో బాగా తిరగాలని ఆయనకు సీఎం సూచించారు. లేదంటే ఆయన తనయుడు డాక్టర్ శ్రీకాంత్ను బాగా తిప్పాలని నిర్దేశించారు. దీంతో సీఎం వ్యాఖ్యలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ అభ్యర్థి విశ్వరూపా..? ఆయన కుమారుడా అనే చర్చ తెరపైకి వచ్చింది.
మరోవైపు విశ్వరూప్ కు వ్యతిరేకత ఉందనే టాక్ పార్టీలో బలంగా ఉంది. అధికార పార్టీలో విభేదాలు ఆయనకు ఇబ్బందిగా మారాయి. తాజాగా సీఎం జగన్ పర్యటన వేళ మరో వివాదం రేగింది. సీఎం సమక్షంలోనే మంత్రి విశ్వరూప్, ప్రభుత్వ విప్ , కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వాదనకు దిగారు. నువ్వెంతంటే.. నువ్వెంత అని అనుకున్నారు. అమలాపురంలో సీఎంకు హెలీప్యాడ్ వద్ద స్వాగతం చెప్పే సమయంలో ఈ ఘటన జరిగింది.
వైసీపీ యువ నాయకుడు అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యంను సీఎంకు చిర్ల జగ్గిరెడ్డి పరిచయం చేయడమే వివాదానికి ప్రధాన కారణం. దీనిపై మంత్రి పినిపే విశ్వరూప్ అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో నీకేంటి పని అంటూ జగ్గిరెడ్డిపై ఫైర్ అయ్యారు. ప్రతిగా జగ్గిరెడ్డి తగ్గు తగ్గు అన్నట్లుగా సైగలు చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఏమైందని సీఎం జగన్ కూడా ఆరా తీశారు.
ఇటీవల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ మధ్య నెలకొన్న వివాదం రామచంద్రపురం నియోజకవర్గంలో రచ్చ రాజేసింది. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సూర్యప్రకాశరావుకు రామచంద్రపురం అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాలని బోస్ పట్టుబడుతున్నారు. అమలాపురం వచ్చిన సీఎం జగన్ వద్దకు తన కుమారుడి తీసుకొచ్చి పరిచయం చేశారు బోస్. ఈ విషయంపై కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తంమీద సీఎం జగన్ అమలాపురం పర్యటన వేళ వైసీపీలో వర్గవిభేదాల ఇలా బయటపడ్డాయి.