ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు అధికారంలోకి వస్తే గుండు కొట్టించుకుంటానన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ హాట్ కామెంట్స్ చేశారు.
వచ్చే ఉగాది తర్వాత టీడీపీ, జనసేన పార్టీలు ఉండవని బొత్స స్పష్టం చేశారు. ఒకవేళ ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని శపథం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో శుక్రవారం ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ఎచ్చెర్ల నియోజకవర్గ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న బొత్స.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు.. ఎన్నికలకు 3 రోజుల ముందు తోటపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారంటూ చంద్రబాబును విమర్శించారు. కానీ అంతా తానే చేశానని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గు లేదా? అని నిలదీశారు.
అవగాహన లేని చేతలు, మాటల సెలబ్రిటీ అంటూ పవన్ కల్యాణ్ పై బొత్స సెటైర్లు వేశారు. జనసేనాని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ గురించి మాట్లాడితే పెద్దవాడైపోయానని అనుకుంటున్నారని విర్శించారు. అన్న పార్టీ మూసేసిన తర్వాత తమ్ముడు దుకాణం తెరిచాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేనాని వాలంటీర్లపై చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. రాజశేఖర్రెడ్డి విగ్రహాలు ఎందుకని పవన్ అంటుంటే ఆశ్చర్యం వేసిందని బొత్స అన్నారు. ఆ విగ్రహాలను జగన్, విజయమ్మ పెట్టమన్నారా? అని ప్రశ్నించారు. ప్రజలే అభిమానంతో పెడుతున్నారని తెలిపారు.
మంత్రి బొత్స గుండు కొట్టించుకుంటానని శపథం చేయడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయ్యారు. టీడీపీ, బీజేపీ మధ్య సయోధ్య కుదుర్చేందుకు జనసేనాని ప్రయత్నిస్తున్నారు. తిరిగి 2014 కాంబినేషన్ తో వచ్చే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు. అటు వారాహి యాత్రతో ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడుతున్నారు.
అటు చంద్రబాబు సాగు నీటి ప్రాజెక్టుల సందర్శన చేపట్టారు. అభివృద్ధి ఎజెండాతో టీడీపీ అధినేత ముందుకుసాగుతున్నారు. ఇటు ఆయన తనయుడు లోకేష్ పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. ఇలా ఏపీ ప్రతిపక్షాలు జగన్ సర్కార్ పై ముప్పేట దాడి చేస్తున్నాయి.
ఏపీలో ప్రతిపక్ష పార్టీల బలం రోజురోజుకు పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో బొత్స గుండు శపథం చేయడం ఆసక్తిగా మారింది. మరి ఆ ఛాలెంజ్ పై టీడీపీ, జనసేన స్పందన ఎలా ఉంటుందో చూడాలి.