తిరుమలలో విషాదకర ఘటన జరిగింది. అలిపిరి నడక మార్గంలో చిన్నారిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి కుటుంబ తిరుమలకు కాలినడకన వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో లక్షిత సహా కుటుంబ సభ్యులు కాలినడకన శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ముందుగా వెళ్తున్న చిన్నారిపై ఒక్కసారిగా చిరుత దాడి చేసింది. దీంతో కుటుంబసభ్యులు గట్టిగా కేకలు వేశారు. అప్పటికే అడవిలోకి చిన్నారిని చిరుత ఈడ్చుకెళ్లింది. దీంతో పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేపట్టలేకపోయారు. ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా.. లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో బాలిక మృతదేహాన్ని లభ్యమైంది. బాధిత కుటుంబ స్వస్థలం నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం.
కొన్నిరోజుల క్రితం అలిపిరి నడకమార్గంలో ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచింది చిరుత. అప్పుడు రాత్రి సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆ బాలుడిని చిరుత అడవిలోకి కొంతదూరం లాక్కెంది. ఆ పసివాడి కుటుంబ సభ్యులు, దుకాణదారులు, పోలీసులు వెంటనే స్పందించారు. చిరుత వెంట పడ్డారు. కొంతదూరం తీసుకెళ్లిన తర్వాత బాలుడిని చిరుత వదిలేసింది. దీంతో వెంటనే ఆ పసివాడిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
కొన్నిరోజుల వ్యవధిలోనే అలిపిరి నడకమార్గంలో మరో ఘటన జరగడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం పెరిగినా టీటీడీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.