కర్ణాటకలో విజయం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతంగా పెరిగింది. అధికారం సాధిస్తామన్న ధీమాతో నేతలున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. తెలంగాణ బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు అప్పగించాలని యోచిస్తోంది.
ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇకపై కాంగ్రెస్ హైకమాండ్ తరఫున ప్రియాంక, డీకే రాష్ట్ర పార్టీకి సంబంధించిన అన్ని అంశాల్లోనూ నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ముఖ్య నేతలు సమన్వయంతో పని చేసే బాధ్యత తీసుకుంటారు. రాష్ట్రంలో సోనియా, రాహుల్, ఖర్గేలతో సభలు నిర్వహిస్తారు.
అధికార బీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇది తమకు లాభిస్తుందని చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో చేరడం బలంగా మారింది. అలాగే మహబూబ్నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇతర జిల్లాల్లో చాలామంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఓ మాజీ మంత్రి కుటుంబం పార్టీ చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ అన్వేషణ కొనసాగిస్తోంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఎన్నికల ప్రచారం, ఇలాంటి అంశాలపైన కాంగ్రెస్ అధిష్ఠానం ఎక్కువగా ఫోకస్ పెట్టిందని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్కు చెందిన ముఖ్య నాయకులు ఇప్పటికే బెంగళూరు వెళ్లి శివకుమార్ను కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితి, నాయకుల బలాబలాలు, పనితీరు లాంటి అంశాలపై డీకే కొందరి నేతలతో చర్చించినట్లు తెలిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చే సర్వే రిపోర్ట్స్ కీలకంగా మారనున్నాయి.