గురువారం విశాఖలో వైసీపీ నేతలకు వారాహి వేదికగా ఖతర్నాక్ వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. సహజ వనరులను దోచుకుంటున్నవారి చిట్టా కేంద్రం దగ్గర ఉందని.. కేంద్రంతో కలిసి ఆట ఆడిస్తానంటూ సీఎం జగన్ను హెచ్చరించారు. కట్ చేస్తే.. జగన్కే వార్నింగ్ ఇస్తే వైసీపీ నేతలు ఊరుకుంటారా? మంత్రులు వరుసబెట్టి జనసేనానికి కౌంటర్లు వేస్తున్నారు. మంత్రి రోజా జబర్దస్త్ డైలాగులు పేల్చారు.
చంద్రబాబు ఆటలో పవన్ అరటిపండు అంటూ ఫైరయ్యారు మంత్రి రోజా. అమిత్ షాకు చెప్పి జగనన్నను ఆటాడిస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. కానీ, దేశాన్ని గడగడలాడించిన సోనియా గాంధీనే జగన్ను ఏమీ చేయలేకపోయిందని గుర్తు చేశారు. జెండా, ఎజెండా లేని నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ దెప్పిపొడిచారు. చంద్రబాబు దత్త, ఉత్తపుత్రుడు రాష్ట్రంలో మూడువైపులా తిరుగుతున్నారని.. ఎవరెన్ని ఎన్ని పర్యటనలు చేసినా జనం జగన్తోనే ఉంటారన్నారు రోజా.
మరోమంత్రి గుడివాడ అమర్నాథ్ సైతం పవన్పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్కు కేంద్రంలో అంత పలుకుబడి ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని సవాల్ చేశారు. కేంద్రానికి చెబితే ఎవరికి భయం? తాము చేసిన తప్పేంటి? ఎవరికో చెబితే భయపడేది జగన్ ప్రభుత్వం కాదని అన్నారు. కేంద్రానికి కాకపోతే.. అమెరికా అధ్యక్షుడు బైడెన్, రష్యా అధ్యక్షుడు పుతిన్కైనా చెప్పుకోండంటూ సెటైర్లు వేశారు మంత్రి అమర్నాథ్.
ఇక, మంత్రి సిదిరి అప్పలరాజు సైతం పవన్పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే పవన్ పని చేస్తున్నారని.. ఆయన అరవమంటే అరుస్తున్నారు.. కరవమంటే కరుస్తారని మండిపడ్డారు.