Budvel Auction : తన భూమి తనకు వదిలేయాలని మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ను వేడుకుంటున్నాడు రంగారెడ్డి జిల్లా బుద్వేల్ రైతు. సర్వేనెంబర్ 288/ 4 లోని 4.19 ఎకరాల భూమికి సంబంధించి అన్ని ధ్రువీకరణ పత్రాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అయినా హెచ్ఎండీఏ అధికారులు తన భూమిని వేలానికి పెట్టారని వాపోయారు.
నిరుపేద దళితులకు 1978లో అప్పటి ప్రభుత్వం భూమి ఇచ్చిందని.. అప్పటి నుంచి పాస్ బుక్లో తమ పేరే రికార్డు అవుతోందని చెబుతున్నాడు రైతు రవీందర్. ప్రభుత్వ నిబంధనల మేరకు 1978 నుండి 1994 వరకు ప్రభుత్వం సూచించిన ప్రకారం 375 రూపాయలు చెల్లించామని గుర్తు చేశాడు. అయితే ఇటీవల దీనిని అధికారులు ప్రభుత్వ భూమి అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులను అడిగితే.. హెచ్ఎండీఏ పరిధిలో ఉందంటూ తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రభుత్వ భూముల వేలం పాటపై కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. బుద్వేల్ లో అమ్మకం పూర్తైన భూములను చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీ కిసాన్ సెల్ నాయకులు కోదండరెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు పెద్దసంఖ్యలో బుద్వేల్ కు వెళ్లారు. అయితే వీరిని పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కిసాన్ కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్విదం జరిగింది.